మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు, వడగళ్ల వాన విరుచుకుపడి, రైతుల పొలాలు, తోటలు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు కూడా వేళ్లతో సహా కూలిపోయాయి. అయితే ఏడాది తొలి వర్షం కావడంతో గ్రామాల్లో సంతోషం నెలకొంది. తాలూకాలోని కొప్ప, బెసగారహళ్లి, కెస్తురు, కె. హొన్నలగెరె, కొక్కరె బెల్లూరు, భీమనకెరె, ఇతర పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ వడగళ్ల వాన అర్ధగంటకు పైగా కొనసాగింది. వర్షాధార ప్రాంతాల్లో వరి, జొన్న, చెరకు, కొబ్బరి వంటి పంటలకు జీవం పోసింది. అయితే అరటి, కొబ్బరి తోటలకు నష్టం కూడా కలిగింది. హగలహళ్లిలో 1.20 ఎకరాలలో వెయ్యికి పైగా అరటి చెట్లు పడిపోయాయి. హొన్నలగెరెలో 12 కొబ్బరి చెట్లు, 200 అరటి చెట్లు కూలాయి. వ్యవసాయాధికారులు పరిశీలించి పరిహారానికి హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతంలో కొన్నిచోట్ల చెట్లు, కొమ్మలు, కరెంటు స్తంభాలు నేలకూలి జనజీవనానికి ఇబ్బంది కలిగింది.


