హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం విడిచిన అనంతరం ఆలయం తలుపులు తెరిచి యథావిధిగా స్వామి వారికి విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాన్ని సిబ్బంది శుద్ధి చేశారు. భక్తుల సందడితో ఆలయ ఆవరణ కళకళలాడింది.
సమస్యలను వెంటనే పరిష్కరించరూ..
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలోని ప్రభుత్వ పీయూ కళాశాలల్లో సేవలందిస్తున్న అతిథి ఉపన్యాసకుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అతిథి ఉపన్యాసకుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం జిల్లా కార్యదర్శి నాగరత్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా అతిథి ఉపన్యాసకులు ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. తక్కువ జీతాలు, ఎక్కువ పని చేస్తూ కష్టాల్లో పడి ఇబ్బందులను అనుభవిస్తున్నామన్నారు. సమయానికి గౌరవ వేతనం అందక జీవించడం సాగించడం కూడా కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న జీతాన్ని రెట్టింపు చేయాలన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. జిల్లాధ్యక్షుడు రంగన్న, ప్రముఖులు రాజేష్ భట్, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు.
యరగేరను తాలూకా
కేంద్రంగా ప్రకటించండి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేర తాలూకా పోరాట సమితి సంచాలకులు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 కి.మీ. దూరంలో ఉన్న యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. మూడేళ్ల నుంచి తాలూకా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ అధికమవుతున్నందున 2026–27లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ప్రతిపాదించేలా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
అసంపూర్తి
రోడ్డు పనులపై ఆగ్రహం
బళ్లారిఅర్బన్: నగరంలోని 18వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ మూడవ ప్రధాన రోడ్డులో చేపట్టిన అభివృద్ధి పనులు నెలన్నర గడిచినా పూర్తి కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పేరుతో సుమారు ఒక అడుగు లోతు వరకు మొత్తం రోడ్డును తవ్వి వదిలేయడంతో పాటు ఓపెన్ డ్రైనేజ్ కూడా తవ్వి ఉంచినందున ఇళ్లకు వెళ్లి రావడం కష్టంగా మారిందని అక్కడి నివాసులు తెలిపారు. పనులు ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కానీ మహానగర పాలక సంస్థ సిబ్బంది కానీ పరిశీలనకు రాలేదని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరుతూ మహానగర పాలికె కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. వెంకటేశ్వర నగర్ సేవా సంఘం అధ్యక్షుడు పీ.ధనంజయ్, భీమలింగనగౌడ, పీఎం.నటరాజ్, లోకరాజ్, వీరేష్, ఎం.రవి, సతీష్, ముల్లంగి గిరి, రఘు, మయూర ట్రాన్స్పోర్ట్ శీనా తదితరులు పాల్గొన్నారు.


