హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన దివంగత పండిత పుట్టరాజ గవాయి 112వ జయంతి వేడుకలు మంగళవారం గదగ్ నగరంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సర్వ ధర్మ సామూహిక వివాహ కార్యక్రమంలో చంద్రగ్రహణం రోజే 19 జంటలు కొత్త జీవితంలోకి అడుగు మోపాయి. ముందు నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో గవాయి మఠంలో ప్రత్యేక పూజలతో పాటు గవాయి చిత్రపటం ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. మఠం సన్నిధిని వైవిధ్యంగా పూలతో అలంకరించారు. హోలీ పుణ్యమి, చంద్రగ్రహణ మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పే ఉద్దేశంతో హిందూ, ముస్లిం తదితర వివిధ మతాల జంటలు ఈ వేదికలో ఒక్కటయ్యారన్నారు. వధువులకు ఉచితంగా మాంగల్యంతో పాటు అవసరమైన వస్త్రాలను అందజేశారు. అలాగే భారీగా కేక్ కట్ చేశారు. 1012 మంది ముత్తైదువులతో వైభవంగా కుంభమేళా నెరవేర్చారు. వివిధ వాయిద్య మేళాలతో కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. వీరేశ్వర పుణ్యాశ్రమం పీఠాధిపతి కల్లయ్యజ్జ, తోంటధార్య మఠం డాక్టర్ తోంటద సిద్దరామ స్వామితో పాటు పలువురు ప్రముఖులు బాగలకోటె, హావేరి, ధార్వాడ తదితర జిల్లాల నుంచి భక్తులు విశేషంగా తరలి వచ్చారు.


