సాక్షి బళ్లారి: పశ్చిమ ఆసియాలోని ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ దేశాధినేత ఖమేనీని హత్య చేసిన నేపథ్యంలో ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇన్స్టాలో స్టేటస్ పెట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కొప్పళ జిల్లా గంగావతి పట్టణానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఇరాన్ దేశాన్ని పాలిస్తున్న ఖమేనీ హత్యకు సంబంధించిన వార్తపై ఒక వీడియోను తన ఇన్స్టాలో స్టేటస్గా పెట్టుకోవడంతో ఓ సమాజానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐదారుగురు యువకులు చంద్రశేఖర్ వ్యాపారం చేస్తున్న ప్రదేశానికి చేరుకొని మాటల తూటాలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వివాదం తీవ్రరూపం దాల్చడంతో అతనిపై దాడికి దిగారు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన నేపథ్యంలో దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ గంగావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడిన నిందితులపై గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
యువకుడిపై దాడి
కొప్పళలో ఉద్రిక్తత


