కన్నీటి ప్రయాణమైన తీర్థయాత్ర | - | Sakshi
Sakshi News home page

కన్నీటి ప్రయాణమైన తీర్థయాత్ర

Mar 5 2026 7:20 AM | Updated on Mar 5 2026 7:20 AM

కారులోనే విగతజీవులుగా మారిన దృశ్యం

లారీ కిందికి దూసుకెళ్లిన కారు

ముందు వెళ్తున్న లారీని కారు ఢీ

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

బెంగళూరు నుంచి తిరుమలకు

వెళ్తుండగా పలమనేరు వద్ద ప్రమాదం

పలమనేరు/ గంగవరం: కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. బెంగళూరులోని రాజాజీనగరకు చెందిన మోహన్‌రావు (71), కుసుమ (61) భార్యాభర్తలు. నాగరాజరావు(68), జయంతి (61) వృద్ధ దంపతులు. నాగరాజరావు కుమార్తె పూజ (32) కారులో వెళ్తూ వెనుక నుంచి లారీని ఢీకొనడంతో దుర్మరణం చెందారు.

ఎలా జరిగింది?

బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కారును మోహన్‌రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు.

వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ ఉన్నారు.

ముళబాగిళ్‌ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్‌ చేసి కదిలారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద బైపాస్‌లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళుతున్న ఖాళీ సిమెంట్‌ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లి చిక్కుకుంది.

దీన్ని గమనించని లారీ డ్రైవర్‌ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు.

పక్కరూట్లో వెళ్లే వాహనాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీని రోడ్డు పక్కన ఆపాడు.

ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న వారందరూ నిమిషాలలో మరణించారు. వీరిలో కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు.

ఆ కుటుంబంలో త్వరలో ఓ శుభ కార్యం ఉండడంతో బంధువులు ఎంతో సంతోషించారు. కార్యం దిగ్విజయం కావాలని.. ముందుగా ఇలవేల్పు

తిరుమల వెంకటేశ్వరస్వామిని

దర్శించుకుని ఆశీర్వాదం పొందాలనుకున్నారు. కుటుంబంతో కలిసి కారులో తిరుమల కొండకు బయలుదేరారు. ఇంతలోనే విధి వక్రించి

ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

బెంగళూరువాసుల తీర్థయాత్ర విషాదమయమైంది.

తెరుచుకోని ఎయిర్‌ బెలూన్లు

కారు డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకుని ఉంటాడని భావిస్తున్నారు. కారులోని వారంతా సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్‌ బెలూన్లు మాత్రం ఓపెన్‌ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు తగలకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకుని ఉంటే ప్రాణనష్టం తగ్గేదని పోలీసులు పేర్కొన్నారు. జేసీబీతో చాలాసేపు ప్రయత్నించి కారును, మృతదేహాలను బయటకు తీశారు.

వెంకటేశ్వరా.. కాపాడలేదే?

బంధువుల రోదనలు

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన కాసేపటికే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పొద్దున బై బై చెప్పి బయల్దేరిన వారు ఇలా అవుతారని అనుకోలేదు.. నెలకు రెండుసార్లు తిరుమలను దర్శించే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్ష వేయడం ఏమిటి..? అని కుసుమ, జయంతిల అన్న తీవ్రంగా విలపించారు. కారు పేరు కూడా సెవెన్‌హిల్స్‌ అని పెట్టుకున్నామే.. ఆ వెంకన్నకు మాపై దయలేదా..? అని రోదించారు. మృతుల్లో నాగరాజరావు గతంలో బళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమార్తె, మృతురాలు పూజ బెంగళూరులోనే టెక్కీగా పనిచేసేది. నాగరాజరావు కుమారుడు జర్మనీలో ఉంటాడు. బంధువుల రోదనలు

అందరినీ కంటతడిపెట్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement