
అరటి తోటలో కొండచిలువ
శివమొగ్గ: అరటి తోటలో భారీ కొండచిలువ కనపడింది. స్నేక్ కిరణ్ ఆ కొండచిలువను భద్రంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. శివమొగ్గ జిల్లా పురదాళు సమీపంలోని హనుమంతాపుర గ్రామంలో సుమారు 9 అడుగుల కొండచిలువ కనిపించింది. వెంటనే స్నేక్ కిరణ్కు స్థానికులు సమాచారం అందించడంతో ఆయన వెంటనే వచ్చి దాన్ని పట్టుకుని దూరంగా వదిలిపెట్టారు.
రాగి ముద్దలో
విషం పెట్టి అత్త హత్య
యశవంతపుర: అక్రమ సంబంధాల మోజులో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే వివాహిత తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. వివరాలు.. అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది ఆరగించిన దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు.

అరటి తోటలో కొండచిలువ