
శ్రామిక భవనం నిర్మించండి
బళ్లారి అర్బన్: జిల్లాలో కట్టడ తదితర నిర్మాణ కార్మికులు 55 వేల మందికి పైగా ఉన్నారని, అసంఘటిత రంగంలోని కార్మికులు 50 వేలకు మించి రవాణా సంబంధిత కార్మికులు మరో 15 వేల మంది ఉన్నారని, వారి కుటుంబాల సంక్షేమానికి శ్రామిక భవనం నిర్మించాలని కళ్యాణ కర్ణాటక కట్టడ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు సంఘం తరఫున కమిషనర్కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కార్మికులకు తమ బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల వివాహాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, కార్మిక శాఖలో కార్మికుల సౌకర్యాల గురించి జాగృతి అభియాన్, సంబంధిత శాఖ తదితర కార్యక్రమాలు, ఇతర వేడుకలు నిర్వహించుకోడానికి జిల్లా కేంద్రంలో శ్రామిక భవనం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మిక వర్గాల అనుకూలం కోసం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక భవనాన్ని నిర్మించాలని కళ్యాణ కర్ణాటక కార్మిక సంఘం సంస్థాపక అధ్యక్షుడు ఎం.మల్లేష్ ఇటీవల దావణగెరె కార్మిక శాఖ ఏఎల్సీ కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
బెళగావికి డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు
● 50 కేజీల గంజాయి, రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాల జప్తు
సాక్షి,బళ్లారి: కుందానగరి బెళగావిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని సూత్రధారి ఇస్మాయిల్ సద్దాం సయ్యద్, తాజీర్ బస్తావాడే, రథమేషలాడ్, తేజస్ వాజరే, శివకుమార్ హసబే, రంజాన్ జమాదార, తాజీబ్ ముల్లా, అనురాధ అరెస్ట్ అయిన నిందితులు. బెళగావి సీఈఎన్ సీఐ బీఆర్ గడ్డేకర్ బృందం భారీ కార్యాచరణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. బెళగావిలో విద్యా సంస్థల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి, పెన్ని, హెరాయిన్ విక్రయించే దందాలో సదరు ముఠా సభ్యులు మునిగిపోయిన క్రమంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
రాయచూరు రూరల్ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపద, అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య సూచించారు. శనివారం నగరంలోని రక్తనిధి కేంద్రంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్స్ల ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పుట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం చేయడంతో ఇతరులకు ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇవ్వడం వల్ల మనిషి దేహంలో కొత్త రక్తం పుడుతుందన్నారు. విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ నాయక్, డాక్టర్ శ్యామణ్ణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, గిరీష్, రాజేంద్ర, నీలోఫర్లున్నారు.
చెలరేగిన మహిళా దొంగలు
● కత్తులతో బెదిరించి దోపిడీ
కణేకల్లు: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు వద్ద ఓ ప్రయాణికురాలిని మహిళా దొంగలు కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు... కణేకల్లుకు చెందిన యశోద అనే మహిళ రెండ్రోజుల క్రితం తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్న కూతురు ఇంటికెళ్లింది. శనివారం స్వగ్రామానికి బయలుదేరింది. సాయంత్రం కళ్యాణదుర్గం–బళ్లారి బస్సు ఎక్కింది. కణేకల్లు క్రాస్లో ఈమె బస్సు దిగాల్సి ఉండగా... నలుగురు మహిళలు పక్కా ప్లాన్తో వారు కూడా దిగుతున్నట్లు బ్యాగులు సర్దుకొని దిగేలా నటించి బస్టాప్ దాటిపోయేలా చేశారు. పెట్రోల్ బంకు సమీపంలో ప్రయాణికురాలు బస్సు ఆపమనడంతో ఆమెతో పాటు నలుగురు మహిళలు ఊరి బయట బస్సు దిగారు. ఒంటరిగా ఉన్న యశోదను మహిళలు కత్తులు చూపించి నీ వద్ద ఉన్న డబ్బులు, ఆభరణాలను ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరించడంతో భయపడింది. ఆమె తన హ్యాండ్బ్యాగులో ఉన్న సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చేయగా తీసుకుని మహిళలు పరారయ్యారు. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా దొంగల హల్చల్ స్థానికంగా కలకలం సృష్టించింది.

శ్రామిక భవనం నిర్మించండి

శ్రామిక భవనం నిర్మించండి