
దివంగత ప్రముఖులకు సంతాపం
బనశంకరి: రాష్ట్ర అధికార కాంగ్రెస్లో ఆకస్మికంగా రాజకీయ సంక్షోభం వంటిది తలెత్తింది. అది కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజునే. సీనియర్ నేత, సహకారశాఖ మంత్రి కేఎన్.రాజణ్ణ సోమవారం మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. విధానసౌధలో మధ్యాహ్నం సీఎం సిద్దరామయ్యకి క్లుప్తంగా రాసిన రాజీనామా లేఖను అందజేశారు. సీఎం ఆమోదం తెలిసినట్లు సమాచారం.
పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ల చోరీ వ్యతిరేక పోరాటం గురించి రాజణ్ణ చులనకగా మాట్లాడడమే ఉద్వాసనకు కారణమని తెలుస్తోంది. ప్రముఖ నేతలు, కార్యకర్తలు రాజణ్ణను మంత్రివర్గం, పార్టీ నుంచి బహిష్కరించాలని హైకమాండ్కు ఫిర్యాదు చేశారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో రాజణ్ణ కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ తో పాటు పలువురిపై బహిరంగ విమర్శలు చేశారు. మరో డిప్యూటీ సీఎం పదవిని సృష్టించాలని కోరేవారు. సిద్దరామయ్య ఐదేళ్లూ సీఎం అని ముందు నుంచీ రాజణ్ణ చెబుతూ వచ్చారు. సోమవారం శాసనసభ సమావేశాల ప్రారంభంలో రాజణ్ణ కనబడలేదు. విధానసౌధలో సీఎం సిద్దరామయ్య ఉన్నా కూడా రాజణ్ణ కలవకుండా దూరంగా ఉన్నారు. సిద్దరామయ్య ఆప్తుడైన రాజణ్ణ కు ఈ పరిణామాలలో రక్షణ కరువైంది. మధ్యాహ్నం సిద్దరామయ్యతో చర్చించారు, రాజీనామా చేయాలని హైకమాండ్ చెప్పినట్లు సీఎం తెలిపారు. ఆ మేరకు రాజీనామా పత్రం అందజేయడంతో సిద్దరామయ్య అంగీకరించారు.
విధానసభలో రగడ
మంత్రి రాజణ్ణ రాజీనామా చేశారనేది విధానసభలో రగడకు కారణమైంది. భోజన విరామం తరువాత సభ సమావేశం కాగానే బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ మాట్లాడుతూ టీవీలలో రాజణ్ణ రాజీనామా వార్తలు వస్తున్నాయి, దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన ఆయన మంత్రులు కూర్చునే చోట ఎలా కూర్చుంటారని కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. స్పీకర్ తనకు సీటు కేటాయించారని, నేను కూర్చున్నానని చెప్పడం సరికాదని అన్నారు. మంత్రి కానీ వారు అక్కడ కూర్చోరాదని అశోక్ అన్నారు. మంత్రి హెచ్కే.పాటిల్ మాట్లాడుతూ మీడియాలో వస్తోందని ఇక్కడ చర్చించడం సరికాదని, దీనిపై ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేస్తారని తెలిపారు.
ఇదొక నిర్లక్ష్య సర్కారు: విపక్షాలు
శివాజీనగర: అసెంబ్లీ ఆరంభానికి ముందుగానే బీజేపీ, జేడీఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధానసౌధ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు బీ.వై.విజయేంద్ర, అశోక్, జేడీఎస్ నేత సీ.బీ.సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట, ఎరువుల సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. స్టేడియం తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, డీసీఎంలే కారణం. ఇదొక నిర్లక్ష్య సర్కారు అని ధ్వజమెత్తారు. తొక్కిసలాట కేసులో అమాయక పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఫోటోల పిచ్చి కోసం తొక్కిసలాట ద్వారా అమాయకులను హత్య చేశారని , దుర్ఘటన జరుగుతుంటే సీఎం దోసెలు తినడానికి వెళ్లారని అశోక్ ఆరోపించారు.
శివాజీనగర: రాష్ట్ర విధానసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కాగా, నటీమణి బీ.సరోజాదేవి తదితర ఇటీవల మరణించిన పలు రంగాల ప్రముఖులకు సంతాపం తెలిపారు. వారిని స్మరిస్తూ సభాపతి యూ.టీ.ఖాదర్ పేర్లను చదివి ఒక నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. దీంతో పాటుగా పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో బలైనవారు, ఆర్సీబీ జట్టు విజయోత్సవంలో తొక్కిసలాటతో చనిపోయినవారికి, గుజరాత్లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మృతులకు సంతాపం తెలిపారు. వీరందరి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. సంతాప తీర్మానంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రతిపక్ష నేతలు, మంత్రుల మాట్లాడారు.
స్పీకర్ ఆగ్రహం
సంతాప తీర్మానంపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో కన్నడ సంస్కృతి మంత్రి శివరాజ తంగడగి పక్కనున్న ఎమ్మెల్యే సీటు వద్ద ముచ్చటిస్తూ ఉన్నారు. ఇది చూసిన సభాపతి ఖాదర్.. సభలో సంతాప కార్యక్రమం జరుగుతోంది. ఇది పవిత్రమైనది, తమరు ఇలా మాట్లాడటం సరికాదు. బయటకు వెళ్లి మాట్లాడాలని కోపంగా అన్నారు. సిద్దరామయ్య సైతం మంత్రి తంగడగికి వచ్చి సీట్లో కూర్చోవాలని సూచించారు.

దివంగత ప్రముఖులకు సంతాపం

దివంగత ప్రముఖులకు సంతాపం