శివాజీనగర: బెంగళూరు నగరం కోరమంగలలో ఉన్న సెయింట్ జాన్స్ సభా మందిర ఆవరణలో ఆగస్టు 9నుంచి 11వరకు బుక్ బ్రహ్మ సంస్థ ఆధ్వర్యంలో ‘బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం–2024’ నిర్వహించనున్నారు. ఈమేరకు సీనియర్ సాహితీవేత్త హంప నాగరాజయ్య ఆదివారం పోస్టర్లు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కన్నడ, మలయాళం, తెలుగు, తమిళు, ఆంగ్ల భాషలకు సంబంధించిన సుమారు 300 మంది సాహితీవేత్తలు హాజరై 80కి పైగా చర్చాగోష్టిల్లో పాల్గొంటారని తెలిపారు. దక్షిణ భారత శ్రేష్ట సాహితీవేత్తలైన కే.సచ్చిదానందన్, పెరుమాళ్ మురుగన్, బెన్యమిన్, వోల్ల, హెచ్.ఎస్.శివప్రసాద్, వివేక శానభాగ, గిరీశ్ కాసరవళ్లి, మమతా సాగర్, ఎస్.జీ.వాసుదేవ పాల్గొననున్నారని తెలిపారు. డాక్టర్ నరహళ్లి బాలసుబ్రహ్మణ్య మాట్లాడుతూ సాంస్కృతిక స్థితిగతిని పరిశీలిస్తే బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం నిర్వహణ ఆవశ్యమన్నారు. నాలుగు భాషా సాహితీవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చాగోష్టి నిర్వహించనుండటం భారతదేశంలో ఇదే తొలిసారి అన్నారు. ఈ ఉత్సవంలో 60కి పైగా బుక్ స్టాల్స్ ఏర్పాటు అవుతాయన్నారు. ఉత్సవానికి తల్లిదండ్రులతో కలసి వచ్చే చిన్న పిల్లల కోసం ప్రత్యేక చిణ్ణర దుకాణం కూడా ఉంటుందన్నారు.


