● 24 జిల్లాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు హాజరు ● ప్రారంభించిన నరేందర్రెడ్డి, యోగా సంఘం బాధ్యులు
కరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి: రాష్ట్రస్థాయి యోగా పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో 13వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల చాంపియన్షిప్ పోటీలకు 24 జిల్లాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు హాజరయ్యారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పోషకుడు వి.నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సబ్ జూనియర్ విభాగంలో 8–10, 10–12, 12–14, జూనియర్ విభాగంలో 14–16, 16–18 వయసు విభాగంలో పోటీలు నిర్వహించగా, రాణించిన ముగ్గురిని జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ 2036లో దేశంలో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు యోగాలో పాల్గొనే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ యోగా అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేవారిని రాజస్థాన్లోని జైపూర్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్, నల్గొండ క్రీడాకారుల యోగాసనాలు అబ్బురపరిచాయి. మల్లీశ్వరి, రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల్లో పాయింట్ల కేటాయింపును పారదర్శకంగా చూపించేందుకు తొలిసారిగా ఆన్స్క్రీన్ ప్రదర్శన ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సిద్ధారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి.జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు టి.రమేశ్రెడ్డి, యోగా సంఘం ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, కమలాకర్, టి.మనోజ్ కుమార్ పాల్గొన్నారు.


