● కోల్బెల్ట్వాసులకు సౌకర్యం ● నేటినుంచి సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రాకపోకలు
రామగుండం: వినాయక చవితి సందర్భంగా శనివారం నుంచి కోల్బెల్ట్ ప్రాంతాలకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘చవితి పండుగకు ప్రత్యేక రైళ్లు ఏవీ’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి వరుస సెలవులు రావడంతో హైదరాబాద్– సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు తరలివస్తున్నారు. వీరికోసం రెండు రోజులపాటు జనసాధారణ్ స్పెషల్ రైలు(07235) సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిపిస్తారు. సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.10గంటలకు బయలుదేరుతుంది. చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్రోడ్డు, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ఆగుతుంది. సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్(07236) మధ్య నడిచే రైలు కాగజ్నగర్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. అయితే, పండుగ తర్వాత 15వ తేదీ నుంచి తిరుగు ప్రయాణాలకు సైతం మరోరెండు రోజులు ప్రత్యేక రైళ్లను నడిపించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కాగా, జాల్నా–తిరుపతి(07814/15 –వీక్లీ)రైలు నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా రాకపోకలను నవంబర్ 27వరకు పొడిగించారు. అదేవిధంగా హెచ్ఎస్ నాందేడ్–తిరుపతి(07603/04వీక్లీ) నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా నడిచే రైలు రాకపోకలను నవంబర్ 25 వరకు పొడిగించారు.


