మహాశక్తి ఆలయంలో పూజల్లో పాల్గొన్న మహిళలు
విశేష అలంకరణలో మానసాదేవి అమ్మవారు
కరీంనగర్ కల్చరల్/గన్నేరువరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నోముకున్నారు. నివాసాల్లో అమ్మవారిని కొలువుంచి, ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. వరాల తల్లీ.. చల్లంగా చూడమ్మా.. అంటూ వేడుకున్నారు. సుహాసినులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, మహాహారతి, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి ఒడిబియ్యం సమర్పించారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుప్రియ అమ్మవారిని దర్శించుకున్నారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట శ్రీమానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం కావడంతో వరంగల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. 108 శివలింగాలకు నీళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేపట్టారు. ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శుక్ర వారం సాయంత్రం మహాశక్తి ఆలయం వద్ద భక్తుల సందడి
అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు


