● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ● కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడాపోటీలు ప్రారంభం
కోల్సిటీ: క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమన్వయం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరిఖని ఆర్సీవో క్లబ్లో ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–ఇ కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. షటిల్, బ్యాడ్మింటన్, లాన్టెన్నిస్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో ఓపెన్ కేటగిరీతోపాటు 18–30, 40+, 50+ విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం
కాళేశ్వరం జోన్స్థాయిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులు వచ్చేనెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జోన్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
లోపాలను సరిదిద్దుకుంటేనే విజయం
సీపీ అంబర్ కిశోర్ఝా మాట్లాడుతూ.. టీమ్వర్క్, పరస్పర సహకారం, నిరంతర సాధన విజయానికి కీలకమన్నారు. తమలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతీపోలీస్ అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని పరస్పర విశ్వాసంతో సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, పెద్దన్న, రమేశ్, మల్లేశం, ఆర్ఎస్ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.


