మల్లాపూర్: మల్లాపూర్ మండలం గొర్రెపల్లి చాకలికుంటలో బుధవారం మొసలి కనిపించింది. రైతులు పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లగా కుంటలో మొసలి కనిపించింది. వారు గ్రామస్తులకు తెలపడంతో సర్పంచ్ ఏలేటి వెంకట్రెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. మత్స్యకారులు, రైతుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.
దుబాయిలో కోరుట్ల యువకుడి మృతి
కోరుట్ల: పట్టణంలోని మోమిన్పురాకు చెందిన అబ్దుల్ రహమాన్ (21) దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెందాడు. రహమాన్ ఏడాది క్రితం ఉపాఽధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి ఈనెల 7న మృతి చెందినట్లు రహమాన్ పనిచేస్తున్న కంపెనీ వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్లు కంపెనీ వారు తెలిపారని తల్లి షపాత్బేగం బోరున విలపిస్తూ తెలిపారు. నిరుపేద రహమాన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రైలు కిందపడి వ్యక్తి..
గోదావరిఖని: ప్రమాదవశాత్తు బొగ్గు రైలు కిందపడి షేక్ మహబూబ్(45) అనే కూలీ బుధవారం మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖణి బాపూజీనగర్లో నివాసముంటున్న మహబూబ్ నిద్రలోంచి లేచి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. 22ఏళ్ల క్రితం పెళ్లికాగా కూతురుతో కలిసి 15ఏళ్లుగా జీవిస్తున్నాడు. నిద్రమత్తులో మూత్రవిసర్జనకు వెళ్లి మృతి చెందినట్లు మృతుడి తల్లి షేక్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు.
చికిత్స పొందుతూ..
కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి వద్ద గత నెలలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా తీవ్రంగా గాయపడిన ఓ వాహనదారుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో బుధవారం మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు తీగలగుట్టపల్లికి చెందిన మిట్టపల్లి వెంకటస్వామి(75) ద్విచక్రవాహనంపై గతనెల 26న ఉదయం 11.30గంటలకు కరీంనగర్కు వస్తుండగా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన సింగసాని రాజ్కుమార్ బైక్తో వెనుకనుంచి వచ్చి బలంగా ఢీకొట్టాడు. కిందపడిన వెంకటస్వామి తలతోపాటు ఇతర చోట్ల తీవ్రగాయలు కావడంతో స్థానికులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


