ముక్కిపోయి.. పురుగుపట్టి..
నమ్మకం తక్కువే
రేషన్ డీలర్లకు తలనొప్పిగా దొడ్డుబియ్యం
స్టాక్ పాయింట్లు, రేషన్ దుకాణాల్లోనే బియ్యం
గోదాముల్లో 5,213.471 మెట్రిక్ టన్నులు
రేషన్ షాపుల్లో 5,821.31 క్వింటాళ్ల నిల్వ
తరలింపునకు టెండర్ పిలిచినా ముందుకు రాని వైనం
జిల్లాలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం వివరాలు
బఫర్ గోదాముల్లో :
4,732.223 మెట్రిక్ టన్నులు
ఎంఎల్ఎస్ పాయింట్లలో :
481.248 మెట్రిక్ టన్నులు
మొత్తం :
5,213.471 మెట్రిక్ టన్నులు
జిల్లాలోని రేషన్ దుకాణాలు :
566
మిగిలిపోయిన బియ్యం :
5,821.31 క్వింటాళ్లు
మానకొండూర్ మండలం కొండపల్కల రేషన్ దుకాణంలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం
మానకొండూర్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తుండగా.. డీలర్లకు పెద్ద సమస్యే వచ్చి పడింది. సన్నబియ్యం ప్రారంభానికి ముందు దుకాణాలతో పాటు స్టాక్యార్డుల్లో పెద్ద ఎత్తున దొడ్డుబియ్యం మిగిలిపోయాయి. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించగా.. మిగిలిపోయిన దొడ్డు బియ్యం పది నెలలుగా రేషన్షాపులు.. స్టాక్యార్డుల్లో ముక్కిపోయి.. పురుగు పడుతున్నాయి. బియ్యం తరలింపునకు టెండర్లకు ఆహ్వానించగా.. ధర ఎక్కువగా ఉందని నిర్వాహకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా రెండుసార్లు జరగ్గా.. మూడోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే ఉన్న దుకాణాల్లో ఇప్పటికే స్థలం సరిపోవడం లేదనే.. ఇరుకు గదులతో రేషన్ పంచేందుకు ఇబ్బంది పడుతుంటే దొడ్డుబియ్యం తలనొప్పిగా మారాయని డీలర్లు అంటున్నారు.
రేషన్ డీలర్ల ఇబ్బందులు
జిల్లాలో సన్నబియ్యం పథకం ప్రారంభమై పది నెలలు అవుతోంది. అప్పటికే స్టాక్ పాయింట్లు, రేషన్షాపుల్లో దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. ఈ బియ్యాన్ని అధికారులు తీసుకెళ్లాల్సి ఉండగా.. నేటికి, స్టాక్ పాయింట్లు, రేషన్షాపుల్లోనే మూలుగుతున్నాయి. బియ్యంలో పురుగు తయారై డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు బియ్యంలో ఉన్న పరుగు ప్రతినెల రేషన్షాపునకు వస్తున్న సన్నబియ్యంలోకి చేరుతుండంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. చాలీ చాలని స్థలంలో రేషన్షాపులు నిర్వహిస్తున్నామని, పురుగు తీవ్రత పెరిగిపోతోందని, మిగిలిపోయిన దొడ్డు బియ్యం స్టాక్ను తీసుకెళ్లాలని కోరుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, రుక్మాపూర్ గోదాముల్లో 4,732.223 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలి పోగా, కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట ఎంఎల్ఎస్ పాయింట్లలోని గోదాంల్లో 481.248 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. జిల్లాలోని 566 రేషన్షాపుల్లో 5,821.31 క్వింటాళ్ల దొడ్డుబియ్యం మిగిలిపోయాయి. గతంలో సివిల్ సప్లై అధికారులు మిగిలిపోయిన దొడ్డుబియ్యానికి టెండరు నిర్వహించగా, రేటు గిట్టుబాటు కాక ఎవరూ ముందుకు రాలేదు. సమస్య తీవ్రం అవుతోందని, ఎలాగైనా బియ్యం తరలించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
రేషన్షాపుల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెల వచ్చిన స్టాక్ దింపుకునేందుకు స్థలం లేకుండా పోతోంది. మిగిలి ఉన్న దొడ్డుబియ్యం పాడవుతోంది. నల్ల, తెల్ల పురుగులొస్తున్నాయి. వీటితో సన్నబియ్యం సైతం పాడవుతున్నాయి. దొడ్డు బియ్యం తరలింపునకు రెండుసార్లు టెండరు పిలిచారు. రేటు ఎక్కువగా ఉందని ఉవరూ ముందుకు రావడం లేదు. మరోసారి టెండరు పిలిచినా, ఉన్నరేటు కారణంగా ముందుకువస్తారన్న నమ్మకం లేదు. – రొడ్డ శ్రీనివాస్,
రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ముక్కిపోయి.. పురుగుపట్టి..


