ముస్తాబాద్(సిరిసిల్ల): తండ్రి పేరుతో ఉన్న పొలాన్ని విక్రయిద్దామంటే అన్న అడ్డంకిగా వస్తున్నాడని మనస్తాపంతో ఓ వ్యక్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలోని గంటకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, బాధితులు తెలిపిన వివరాలు. మండలంలోని చిప్పలపల్లికి చెందిన గాడిచర్ల పర్శరాములు(50) పొలం పనులకు వెళ్తున్నానని ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయిన తిరిగి రాలేదు. ఆచూకీ కోసం గాలించగా పెద్దమ్మ ఆలయంలో గంటకు లుంగీతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. అయితే పర్శరాములుకు నలుగురు అన్నదమ్ములు ఉండగా, తండ్రి సాయిలు నుంచి వచ్చిన భూములు పంపిణీ చేసుకున్నారు. పర్శరాములు దుబాయిలో ఉండడంతో ఆయన వాటాగా వచ్చిన భూమిని ఆ సమయంలో పట్టా చేయించుకోలేదు. పర్శరాములు వాటా భూమి తండ్రి సాయిలు పేరుతో ఉండగా, ఇటీవల అప్పులపాలు కావడంతో కొంత భూమిని ఇతరులకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్ సమయంలో పర్శరాములు సోదరుడు లక్ష్మీనర్సయ్య సంతకం చేసేందుకు నిరాకరించాడు. దీంతో అప్పులు ఎలా తీర్చేదని పర్శరాములు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు.