
మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్కుమార్
కరీంనగర్ టౌన్: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రను బేరీజు వేసుకుని తీర్పు ఇవ్వాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల పక్షాన పోరాడుతూ కష్టాల్లో అండగా ఉంటున్నదెవరో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలు, అక్రమ దందాలతో రూ.కోట్లు దండుకున్నదెవరో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. శుక్రవారం రాత్రి ఎంపీ కార్యాలయంలో శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర, గుణగణాలపై ప్రజల్లో చర్చ జరిగేలా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులతోపాటు అన్నివర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ ఖాళీగా కూర్చోలేదని, నిద్రాహారాలు మాని జనంకోసం పనిచేశానని చెప్పారు. కేసీఆర్ సర్కార్పై రాజీలేని పోరాటం చేయడంతోపాటు ప్రజలకు అండగా నిలబడ్డాడననే తృప్తి ఉందని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు చేసిందేమీ లేదంటూ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే తొలి ఏడాది కరోనాతోనే గడిచిపోయిందని, మిగిలిన మూడున్నరేళ్లలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఏకంగా రూ.8వేల కోట్ల పైచిలుకు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం నయాపైసా పనిచేయకపోయినా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను సైతం బీఆర్ఎస్ చేసినట్లుగా సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్ ఎంపీగా తాను ఎన్ని నిధులు తీసుకొచ్చాననే అంశంపై గణాంకాలతో బుక్లెట్ సిద్ధం చేసి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో శక్తికేంద్రం ఇన్చార్జిలు పాల్గొన్నారు.
● శక్తికేంద్ర ఇన్చార్జిల సమావేశంలో బండి సంజయ్