అమాత్య పదవుల్లో మనోళ్లు | Sakshi
Sakshi News home page

అమాత్య పదవుల్లో మనోళ్లు

Published Fri, Nov 10 2023 5:12 AM

గంగుల కమలాకర్‌ - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: ఉమ్మడి జిల్లాకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇప్పటివరకు 21 మ ందిని అమాత్య పదవి వరించింది. పీవీ నర్సింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా పని చేశారు. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు రెండుసార్లు కరీంనగర్‌ ఎంపీగా గెలిచి, అప్పటి ప్రధాని వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేశారు.

● మంథని నుంచి 1983, 85, 89లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దిళ్ల శ్రీపాదరావు 1991 నుంచి నాలుగేళ్లపాటు శాసనసభ స్పీకర్‌గా పని చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు శ్రీధర్‌బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గాల్లో స్థానం దక్కించుకున్నారు.

● పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ఎం.సత్యనారాయణరావు 2004 ఎన్నికల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.

● 1957లో ఎమ్మెల్యేగా ఎన్నికై న జె.చొక్కారావు(కాంగ్రెస్‌) జలగం వెంగళరావు కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. 1985లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సి.ఆనందరావు(టీడీపీ) ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.

● 1994, 99లో నేరెళ్ల(ప్రస్తుతం రద్దు) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న సుద్దాల దేవయ్య(టీడీపీ) చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇక్కడి నుంచే పాటి రాజం మూడుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొంది, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డ్లి కేబినెట్‌లలో చోటు దక్కించుకున్నారు.

● 1985, 89, 94లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన న్యాలకొండ రాంకిషన్‌రావు(టీడీపీ) చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.

● 1978, 83లలో మెట్‌పల్లి(ప్రస్తుతం రద్దు) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వర్ధినేని వెంకటేశ్వర్‌రావు(కాంగ్రెస్‌) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

● 1999, 94లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఇనుగాల పెద్దిరెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఇదే స్థానం నుంచి 2004, 2008(ఉప ఎన్నిక)లలో ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మీకాంతారావు(టీఆర్‌ఎస్‌) వైఎస్సార్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

● 1985, 89, 94, 99లలో వరుసగా నాలుగుసార్లు కమలాపూర్‌(ప్రస్తుతం రద్దు) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దసాని దామోదర్‌రెడ్డి (టీడీపీ) ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. 1962, 67లలో కమలాపూర్‌ నుంచి రెండుసార్లు గెలిచిన కె.వి.నారాయణరెడ్డి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

● 1989, 1999, 2004లో బుగ్గారం (ప్రస్తుతం రద్దు) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్‌రావు వైఎస్సార్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.

● 1994, 2009లలో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణ చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇదేస్థానం నుంచి 1983, 1989, 1996 (ఉప ఎన్నిక), 1999, 2004లలో ఎమ్మెల్యేగా గెలిచిన టి.జీవన్‌రెడ్డి ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ మంత్రివర్గాల్లో సేవలందించారు. ఇక్కడి నుంచే 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జి.రాజేశంగౌడ్‌(టీడీపీ)ను ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రి పదవి వరించింది.

● కమలాపూర్‌లో రెండుసార్లు, హుజూరాబాద్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యారోగ్య, పౌరసరఫరాల శాఖల మంత్రిగా పని చేశారు. శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు.

● 2009, 2010, 2014, 2018లలో వరుసగా నాలుగుసార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు అమాత్య పదవి వరించింది. అలాగే, 2009 నుంచి 2018 వరకు ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్‌ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

● 2009, 2014, 2018లలో వరుసగా కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుతం గంగుల కమలాకర్‌ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రిగా ఉన్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు 21 మందికి మంత్రిగా అవకాశం

సీఎం, పీఎంగా పని చేసిన పీవీ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన చెన్నమనేని

కేటీఆర్‌
1/3

కేటీఆర్‌

ఈటల రాజేందర్‌
2/3

ఈటల రాజేందర్‌

కొప్పుల ఈశ్వర్‌
3/3

కొప్పుల ఈశ్వర్‌

Advertisement
Advertisement