కేసీఆర్ స్వార్థ నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం
● ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్: కేసీఆ ర్ స్వార్థ నిర్ణయాలతోనే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హుజూరాబాద్లో ఆదివారం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజ లను మోసం చేసిందని మండిపడ్డారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతితోనే ప్రాజెక్టు కట్టిన కొద్దిరోజులకే కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాలలో కట్టాల్సిన ప్రాజెక్టును శ్రీశైలం దగ్గరకు మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు స్థల మార్పిడి వెనుక ఉన్న నిధుల దుర్వినియోగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా లని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమించే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పలకల ఈశ్వర్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ‘ఉద్యమాల ఉపాధ్యాయుడు పలకల ఈశ్వర్రెడ్డి’ సంచికను ఆవిష్కరించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవాల న రహరి, చకినాల రాంమోహన్, వీక్షణం సంపాదకుడు వేణుగోపాల్, గంగాధర్ పాల్గొన్నారు.
అభ్యంతరాలు పరిశీలించి సరిచేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. ఆదివారం నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాల పరిశీలన, డివిజన్లవారీగా ఓటర్ల మ్యాపింగ్పై చర్చించారు. ప్రచురించిన ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా డివిజన్, పోలింగ్ బూత్ ప్రకారం మ్యాపింగ్ చేయాలని సూచించారు. జాబితాను డివిజన్ ఓటర్ల ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, సరైన పద్ధతిలో ఓటరు జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణుమాధవ్, ఏసీపీలు వేణు, శ్రీధర్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నా రు. నగరపాలకసంస్థ పరిధిలోని రేకుర్తిలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి సమ్మక్క సారలమ్మ గద్దె వైపు వెళ్లేందుకు రూ.15 లక్షలతో చేపట్టనున్న 200 మీటర్ల సీసీరోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. హుస్సేనీపురలోని 33వ డివిజన్, 32వ డివిజన్ కొంత భాగం మెయిన్ రోడ్డు వరకు రూ.15 లక్షలతో 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డివిజన్ ప్రజలు, స్థానిక నాయకుల కోరిక మేరకు తాము సుడా నిధులతో ఆ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డీఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ సతీశ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, ఎండీ.తాజ్, జక్కుల నాగరాణి ,ఎండీ.చాంద్, అస్తాపురం రమేశ్, అస్తాపురం తిరుమల, షబానా మహమ్మద్, లాయక్, సయ్యద్ ఖలీల్ పాల్గొన్నారు.
కేసీఆర్ స్వార్థ నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం


