సర్పంచ్‌ శ్రీనివాస్‌పై రౌడీషీట్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ శ్రీనివాస్‌పై రౌడీషీట్‌

Sep 21 2023 1:22 AM | Updated on Sep 21 2023 8:27 AM

- - Sakshi

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌పై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. గత మార్చి 13వ తేదీనే రౌడీషీట్‌ ఓపెన్‌చేసినట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. పురుమల్ల శ్రీనివాస్‌పై 24కుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఫోర్జరీ, చీటింగ్‌, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, దురాక్రమణలు, భూ దందాల నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు సదరులేఖలో ఉంది. శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది.

కాగా.. పోలీసులు ముందస్తు వ్యూహంతోనే ఆయనపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గత సీపీ సత్యనారాయణ పదేపదే శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలతో పీడీయాక్టు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అతను అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడం, పై నుంచి ఒత్తిడితో వెనకడుకు వేసినట్లు తెలిసింది. ఇటీవల శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఏడాది మార్చిలోనే శ్రీనివాస్‌పై నమోదు చేసిన రౌడీషీట్‌ను పోలీసులు తెలివిగా బయటకు తీసినట్లు చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతనిపై కొన్నిరోజుల్లో పీడీయాక్టు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీపీ సుబ్బారాయుడును సంప్రదించగా శ్రీనివాస్‌పై మార్చిలోనే రౌడీషీట్‌ తెరిచినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement