హుజూరాబాద్‌ను సిద్దిపేటలా మారుస్తా | - | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ను సిద్దిపేటలా మారుస్తా

Sep 21 2023 1:22 AM | Updated on Sep 21 2023 8:31 AM

- - Sakshi

హుజూరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజూరాబాద్‌ను మరో సిద్దిపేటగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనం లియాఫీ అధ్యక్షుడు పంచల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని సిద్దిపేట మాదిరిగా చేయకపోతే భవిష్యత్‌లో ఓట్లు అడగనని తెలిపారు.

హుజూరాబాద్‌లో మినీస్టేడియం ఏర్పాటు చేస్తానని తెలిపారు. పట్టణంలో కల్యాణ మంటపం, కార్పొరేట్‌ స్థాయిలో బాలికల ఉన్నత పాఠశాల, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, హుజూరాబాద్‌ చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్డు, చిలుకవాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జమ్మికుంటలో వంద పడకల ఆస్పత్రి, వీణవంకలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల, చల్లూరు, వావిలాల, ఉప్పల్‌ను మండలకేంద్రాలుగా మారుస్తామని పేర్కొన్నారు.

ఇల్లంతకుంటను టెంపుల్‌సిటీ, కమలాపూర్‌ను మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డికే తమ మద్దతు ఉంటుందని ఎల్‌ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం కేసీక్యాంపు వరకు బైకుర్యాలీగా వెళ్లారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల భవనానికి భూమి పూజ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, ఎంపీపీ రాణి, వైస్‌ చైర్మన్‌ నిర్మల, లియాఫీ కార్యదర్శి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement