Telangana News: గాంధీ జంక్షన్‌లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..
Sakshi News home page

గాంధీ జంక్షన్‌లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..

Sep 7 2023 1:10 AM | Updated on Sep 7 2023 9:05 AM

- - Sakshi

కరీంనగర్‌: 715 ఫీట్లలోతులో బోర్‌వెల్‌.. 492 ఫీట్ల మేర కేసింగ్‌ పైప్‌.. ఇది నగరంలోని కిసాన్‌నగర్‌ గాంధీ జంక్షన్‌ వద్ద వేసిన అధికారులు వేసిన బోర్‌వెల్‌ లెక్కలు. జంక్షన్‌ అభివృద్ధిలో భా గంగా ఇటీవల వేసిన బోర్‌వెల్‌కు సంబంధించిన లెక్కలు నగరపాలకసంస్థలో జరుగుతున్న అక్రమాలను తారాస్థాయికి తీసుకుపోయాయి. అవడానికి చిన్నబిల్లు అయినా, వేసిన కేసింగ్‌ పైప్‌ లెక్కలు చూసి కాంట్రాక్టర్లు కళ్లు తేలేస్తున్నారు. సింగరేణి మి నహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే ఇంత లోతులో కేసింగ్‌ పైప్‌లైన్‌ వేసిన దాఖలాలు లేవని బోర్‌వెల్‌ యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

175 ఫీట్లలోతులో బోరు..
నగరంలోని కూడళ్ల ఆధునీకరణలో భాగంగా కిసాన్‌నగర్‌ గాంధీ జంక్షన్‌ను అభివృద్ధి చేసి నాలు గు నెలల క్రితం ప్రారంభించారు. జంక్షన్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ బోర్‌వెల్‌ వేశారు. ఈ బోర్‌ వెల్‌కు సంబంధించిన చెల్లింపులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఎంబీ రికార్డ్‌ ప్రతులతో ఈ బోర్‌ 715 ఫీట్లు (218 మీటర్లు) వేసినట్లు, 492 ఫీట్ల (150 మీటర్లు) కేసింగ్‌పైప్‌ వేసినట్లు తేలింది.

మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా 50, 60 ఫీట్లకు మించి కేసింగ్‌ వేయరు. గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి ప్రాంతాల్లో మాత్రమే కేసింగ్‌ పైప్‌లు ఎక్కువగా వేస్తారు. కానీ కరీంనగర్‌ సిటీలో ఈ స్థాయిలో కేసింగ్‌ పైప్‌లు వేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని బోర్‌వెల్‌ యజమానులంటున్నారు. తాము ఇప్పటివరకు 492 ఫీట్ల కేసింగ్‌ పైప్‌ అనే ముచ్చటే వినలేదని ఆశ్చర్యపోతున్నారు.

గ్రానైట్‌ పనులు నిత్యం నడిచే బావుపేట ప్రాంతంలో కూడా 70, 80 ఫీట్లకు మించి కేసింగ్‌ వేయలేదంటున్నారు. తన 35ఏళ్ల సీనియార్టీలో వంద ఫీట్ల కేసింగ్‌ పైప్‌ ఒక్కసారి కూడా వేయలేదని నగరానికి చెందిన ఓ సీనియర్‌ బోర్‌వెల్‌ యజమాని పేర్కొన్నారు. అవినీ తిలో చరిత్ర సృష్టించే ఘనత వహించిన కొంతమంది అధికారులు ఇష్టారీతిన చేస్తున్న అంచనాలు, బిల్లుల వ్యవహారానికి ఇది సజీవ తార్కాణం.

సున్నా జత చేశారా...?
చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు సున్నా జత చేశారా అనే చర్చ సాగుతోంది. అక్కడ 15 మీటర్ల మేరనే కేసింగ్‌ పైప్‌ వేశారని, దానికి సున్నా జత చేసి 150 మీటర్లుగా రాశారని, అలాగే రూ.9,060 బిల్‌ అయితే సున్నా కలిపి రూ.90,600 గా మార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలోనూ ఈ జంక్షన్‌లో గాంధీ విగ్రహాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చాయి.

తాజాగా బోర్‌వెల్‌ లెక్కల్లో నమ్మలేని పనులు జరిగినట్లు బిల్లులు సృష్టించడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై సమగ్రవిచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బోర్‌వెల్‌ కేసింగ్‌ పైప్‌ వ్యవహారంపై ఇంజినీరింగ్‌ అధికారులు స్పందించలేదు. ముందుగా తమ పరిధిలోకి రాదంటూ దాటవేశారు. సంబంధిత ఏఈ విషయం విన్న తరువాత స్పందించడం మానేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement