సదాశివనగర్(ఎల్లారెడ్డి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులను వివరించారు. పాఠశాలలో అత్యున్నత మార్కులు సాధించిన ఇంటర్ సెకండీయర్ బైపీసీకి చెందిన సాత్వికను అభినందించారు. పాఠశాల పరిసరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన వనరులను ప్రిన్సిపల్ రాజిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధతో చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఆమె వెంట డీఈవో మల్లికార్జున్, ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, మోడల్ హాస్టల్ వార్డెన్ ప్రసన్న, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: హెచ్సీఎల్ టెక్బీ జాబ్ డ్రైవ్లో నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. గురువారం నిర్వహించిన జాబ్ డ్రైవ్లో పలువురు విద్యార్థులు పాల్గొన్నప్పటికీ దశల వారీ వడపోతలో చివరికి నలుగురిని ఎంపిక చేశారని పేర్కన్నారు. మార్కులతోపాటు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని హెచ్సీఎల్ టెక్బీ జాబ్డ్రైవ్ గుర్తు చేసిందని ప్రిన్సిపల్ అన్నారు. టీఎస్కేసీ సమన్వయకర్త కిష్టయ్య, మెంటర్ అజారుద్దీన్, టెక్బీ ఇన్చార్జి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు కామారెడ్డి స్టడీ సెంటర్ సమన్వయకర్త ఏ.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లాలోని కోర్టులు గురువారం 86 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు ఆయా కోర్టులలో హాజరుపర్చగా.. ముగ్గురికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 86 మందికిగాను రూ. 1,30,800 ల జరిమానా విధించారని ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.
కామారెడ్డి టౌన్ : చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి గురువారం కలెక్టరేట్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, బ్యాంకుల సమన్వయంతో పీఎం విశ్వకర్మ అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు, నైపుణ్య శిక్షణ, పరికరాల కొనుగోలుకు సాయం, మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఎస్బీఐ, యూబీఐ, ఐవోబీ, టీజీబీ, కెనరా బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొని అర్హులైన వారి నుంచి నేరుగా రుణ దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్, డీఐసీ జీఎం తులసీదాస్, ఏడీ గుల్షం కుమార్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు.


