కామారెడ్డి టౌన్: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిద సూచించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రామకృష్ణ మెడికల్, లయన్స్ క్లబ్ల సహకారంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పండుగకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జీలు నాగరాణి, సుమలత, దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, న్యాయవాదులు వెంకట్రాంరెడ్డి, శ్యామ్గోపాల్రావు, శంకర్ రెడ్డి, జగన్నాథం, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మాయా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
12న జాతీయ లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : ఈనెల 12న జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద సూచించారు. గురువారం కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ కోసం కామారెడ్డి ప్రధాన కోర్టు ప్రాంగణంలో 4, ఎల్లారెడ్డిలో 1, బిచ్కుందలో బెంచ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ బెంచ్ల ద్వారా రాజీకి అనుకూలమైన క్రిమినల్, సివిల్, చెక్బౌన్స్, బ్యాంక్ రికవరీ, మోటారు వాహన ప్రమాద పరిహారం, కుటుంబ, కార్మిక, విద్యుత్, నీటి బిల్లుల వివాదాలతో పాటు ప్రీ లిటిగేషన్ వివాదాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ఇచ్చేది తుది తీర్పని, దీనిపై అప్పీలు ఉండదని పేర్కొన్నారు. రాజీకి సిద్ధంగా ఉన్న కక్షిదారులు తమ న్యాయవాదులు, పోలీసు అధికారులు లేదా డీఎల్ఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


