కామారెడ్డి అర్బన్: వ్యవసాయానికి 18 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి తెలిపారు. గురువారం కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న పది గంటల విద్యుత్తో వరి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాకు రైతులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు సాయిరెడ్డి, చిన్న అంజన్న, తోట సాయిలు, రాంరెడ్డి, నారాయణరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: గణేశ్ మండపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని విద్యుత్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. గురువారం విద్యుత్ అధికారులతో ఎస్ఈ సమావేశం నిర్వహించి గణేశ్ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేయవద్దని, నాణ్యమైన వైర్లు, ఎంసీబీలు వినియోగించాలన్నారు. విద్యుత్ వైర్లు తడవకుండా, పిల్లలు వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వవద్దని ఎస్ఈ స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ 1912 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


