నిజాంసాగర్: పంట పొలానికి నీరు పారించేందుకు కుంటలోకి దిగిన సుంకె సాయిలు (38) అనే రైతు బుధవారం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్నగర్ మండలం హసన్పల్లి గ్రామానికి చెందిన సుంకె సాయిలు గ్రామ శివారులో వరి పంట సాగు చేశాడు. పొలానికి నీరు పారించేందుకు ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని బోయినోళ్ల తూమును ఎత్తేందుకు నీటిలోకి దిగాడు. తూమును ఎత్తేందుకు నీటిలోకి వెళ్లిన సాయిలు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. అదే సమయంలో కుంట వద్ద ఉన్న రైతులు గమనించి నీటమునుగుతున్న సాయిలును కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను నీటమునగడంతో కుటుంబీకులు, గ్రామస్తులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.


