రేపు నిజామాబాద్‌కు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

రేపు నిజామాబాద్‌కు గవర్నర్‌ రాక

Aug 24 2026 1:01 AM | Updated on Aug 24 2026 1:01 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకేంద్రానికి ఈనెల 25న రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్ల రానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం హెలికాప్టర్‌లో ఆయ న బయలుదేరి, జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి పోలీ సు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకొని, యాంటిడ్రగ్‌ అవేర్‌నేస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆర్యనగర్‌లోని పసుపుబోర్డు కార్యాలయంలో నిర్వహించే వివిధ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద గల పీహెచ్‌ఆర్‌ కన్వెషన్‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి మళ్లీ కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోతారు.

గురుకులాల్లో

స్పాట్‌ అడ్మిషన్లు..

బాన్సువాడ రూరల్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు, ఇంటర్‌ ఫస్టియర్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 25న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. బోనాఫైడ్‌, ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎస్‌ఎస్‌సీ మెమో తదితర ఒరిజినల్‌, జిరా క్స్‌ సర్టిఫికెట్లతో బాలికలు తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకులం, బాలురు భిక్కనూరు గురుకులంలో హాజరుకావాలని ఆ యా పాఠశాలల ప్రిన్సిపల్స్‌ తెలిపారు. బాలికలకు తాడ్వాయి, తాడ్కోల్‌ (కొయ్యగుట్ట), బాన్సువాడ (బోర్లం క్యాంపు), తక్కడపల్లి, ఎక్లారా, దోమకొండ, లింగంపేట్‌ (కామారెడ్డి)లో, బాలురకు భిక్కనూర్‌, ఉప్పల్‌వాయి, ఎల్లారెడ్డి, బిచ్కుంద(అచ్చంపేట్‌)లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈద్‌ ఈ మిలాద్‌

శాంతియుతంగా జరుపుకోవాలి

కామారెడ్డి అర్బన్‌ : మహ్మద్‌ ప్రవక్త జయంతి ఈద్‌ ఈ మిలాద్‌ (మిలాద్‌ ఉన్‌ నబి) పండుగను శాంతి, సామరస్య పూర్వకంగా జరుపుకోవాలని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్‌లో ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దల సలహాలు, సూచనలు స్వీకరించారు. పోలీసులతో సమన్వయం చేయడానికి పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో సీఐ నరహరి తదితరులు ఉన్నారు.

రోడ్డు నిర్మాణ పనులు

ప్రారంభం

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలో పంచముఖ హనుమాన్‌ మందిరం నుంచి రైల్వే గేట్‌ వరకు చేపడుతున్న రోడ్డు పనులను ఆదివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ రూ. 25 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌, ఇప్ప శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆటోల బంద్‌

ప్రయాణికులు సహకరించాలి: జేఏసీ

కామారెడ్డి అర్బన్‌ : ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ఆటో బంద్‌కు ప్రయాణికులు సహకరించాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు కోరారు. ఆటో బంద్‌ నేపథ్యంలో జేఏసీ నాయకులు ఆదివారం మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతిన్నదని, కాగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో జేఏసీ నాయ కులు ఎస్‌కే హైమద్‌, ఆర్‌.కృష్ణ, సాయిరాం, రవి, స్వామి, వడ్ల కృష్ణ, బి.రాజు, నబీ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement