● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
● కౌలాస్ ఆయకట్టుకు నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్) : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోరారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి కౌలాస్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టులోని నీటికి పూజలు చేసి, ఆయకట్టుకు సాగు నీరందించే డిస్ట్రీబ్యూటరీ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండటంతో కౌ లాస్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. మంజీర నది పరీవాహక ప్రాంతం వైపు పశువుల కాపర్లు, రైతులు, ప్రజలు వెళ్లొద్దని సూచించారు. వరదతో లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సమాచారం అందించాలన్నారు. అస్తినష్టంతోపాటు ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మె ల్యే వెంట జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు రమేశ్ దేశాయ్ తదితరులు ఉన్నారు.
కౌలాస్లోకి 650 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కౌలాస్ నా లా ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 457.68 మీటర్లు 1.160 టీఎంసీల నీరుంది. దీంతో గేట్లు ఏక్షణమైనా తెరువొచ్చని, ప్రజలు ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు.


