నీటిని వృఽథా చేయొద్దు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తాగునీటిని వృధా చేయొద్దని సర్పంచ్ ఉమర్ సూచించారు. ఆదివారం నీటి వృథాపై విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని గ్రామంలో అవగాహన కల్పించారు. ఇళ్ల ముందర ఉన్న నీటి కుళాయిలకు ట్యాప్లను బిగించుకోవాలని సూచించారు. రానున్న వేసవి కాలంలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అ ధ్యక్షుడిగా నార్సోల్ల మహేశ్, ఉపాధ్యక్షుడిగా రాచకొండ నరేశ్,ప్రధాన కార్యదర్శిగా అంక రా జు సంపత్,జాయింట్ సెక్రెటరీగా సతీష్, కోశాధికారిగా ఇస్తరి మహేష్, జాయింట్ క్యాషియ ర్గా మద్దిమల్ల భీమయ్యలను ఎన్నుకున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ సోమవారం రాత్రి 11 గంటలకు ముగుస్తుందని ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే చెరుకును ఫ్యాక్టరీకి తరలించాలని కోరారు. అగ్రిమెంట్ చేయని రైతులు కూడా చెరుకును గడువులోగా ఫ్యాక్టరీకి తరలించాలన్నారు. క్రషింగ్ సీజన్ ముగిసిన తర్వాత మిగిలిన చెరుకునకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని తెలిపారు. ఫీల్డ్మన్ లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో చెరుకు లోడ్తో సహా ఫ్యాక్టరీకి వచ్చి పర్మిట్లు పొందాలని పేర్కొన్నారు.
నస్రుల్లాబాద్: ఇతరుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్ర అన్నారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో మతాలకు సంబంధించి పోస్ట్ చేసిన దుర్కి గ్రామానికి చెందిన సమీర్ అనే యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు. కులమతాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఎల్లారెడ్డి: వేసవిలో జరిగే దొంగతనాలు, సైబర్ నేరాలపై పోలీసులు ఆదివారం ఎల్లారెడ్డిలో ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో పోలీసు కళాబృందం సభ్యులు సైబర్ నేరాల గురించి, దొంగతనాల గురించి వివరించారు. అత్యవసర సమయంలో 100 నంబర్కు కాల్ చేయాలని.. ఇన్స్ట్రాగామ్,ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాతో జాగ్రత్త ఉండాలన్నారు. వేరే ఊళ్లకు వెళ్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలనిపోలీస్ కళాబృందం ఇన్చార్జి రామంచ తిరుపతి ప్రజలకు సూచించారు. ఎల్లారెడ్డి షీటీమ్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్లూ కోట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్స్లు, పొల్యూషన్, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్లో చలనులు ఉన్న వాహనాలకు ఆన్లైన్లో డబ్బులు కట్టేలా చర్యలు తీసుకున్నారు.
నీటిని వృఽథా చేయొద్దు


