ఎత్తితే లేవవు.. దించితే దిగవు
నిరుపయోగంగా మూడు గేట్లు
నిజాంసాగర్ ప్రధాన కాలువ గేట్లు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ వరద గేట్లకు నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించే ప్రధాన కాలువ గేట్లు తుప్పు పట్టి మొరాయిస్తున్నాయి. దీంతో ‘సాగర్’ జలాలు వృథా అవుతున్నాయి. ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టిన ప్రతీసారి వరద గేట్లను కిందకు దించడం నీటి పారుదల శాఖ సిబ్బంది కష్టతరమవుతోంది.
ప్రాజెక్టుకు తొమ్మిది వరద గేట్లు..
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కోసం అప్పట్లో 9 వరద గేట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రానికి నాలుగు గేట్లు, మిగితా 5 గేట్లు నీటి పారుదలశాఖ ఆధీనంలో ఉన్నాయి. అయితే, ఆయకట్టు కింద పంటల సాగు అవసరాలకు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువకు నీటిని విడుదల చేస్తున్న ప్రతీసారి గేట్లు ఎత్తడం, నిలిపివేత సమయంలో కిందకు దించుతారు. ఈ నేపథ్యంలో ప్రతీసారి గేట్లు మొరాయిస్తున్నాయి. 365 రోజులపాటు గేట్లు నీటిలో ఉండటంతో తుప్పు పడుతున్నాయి.
ప్రధాన కాలువ గేట్ల మరమ్మతులతోపాటు స్టాప్ లాక్ గేటు ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం నిధులు వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉండటం లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వలతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రాజెక్టులో నీరు ఖాళీ అయితే పనులు చేపడుతాం.
– సోలోమాన్, ఈఈ, నీటిపారుదల శాఖ
నిజాంసాగర్ ప్రధాన కాలువ మూడు గేట్లు మూలనపడ్డాయి. గ్రీసింగ్, ఆయిలింగ్ తదితర నిర్వహణ సరిగ్గా లేక తుప్పుపట్టాయి. మిగిలిన రెండు గేట్లల్లో ఒక గేటు పైకి ఎత్తినా లేవదూ..కిందకు దించినా దిగదు అన్నట్లుగా ఉంది. ఒక్క గేటు ద్వారానే ప్రధాన కాలువకు నీటి విడుదల చేపడుతున్నారు. గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకుంటే నీటి విడుదల కష్టంగా మారనుంది.
నిర్లక్ష్యం నీడన ‘సాగర్’ గేట్లు
మొరాయిస్తూ మూలనపడ్డ
మూడు గేట్లు
మిగిలిన రెండు గేట్లు
పనితీరు అంతంతే
నీటి విడుదలకు తప్పని గేట్ల కష్టాలు
ఎత్తితే లేవవు.. దించితే దిగవు


