నారుమడులపై చలిప్రభావం
జింకు లోపం గుర్తించాం
బీబీపేట: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను వ్యవసాయాధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుందని వారు తెలుపుతున్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, జిల్లాల్లో వారం రోజుల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగుగా మారి ఆ తర్వాత ఎండిపోతాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగని పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.
నారుమడి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది.
● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి.
● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి.
జింకు లోపం..
● చలి ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ లోపం కనిపిస్తుంది.
● ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి.
క్రమేపి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. అలాగే ఆకు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి.
● మొక్కలు గిడసబారతాయి. నత్రజని ఎరువులు వేసినప్పటికీ నారుమడి పచ్చబడదు.
చలి తీవ్రతకు నారుమడులు కొద్దిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు నారుమడుల్లో జింకు లోపం గుర్తించామన్నారు. నివారణకు రైతులకు మందులు పిచికారి ఎలా చేయాలో సలహాలు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుంటే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. నివారణ జింకు సల్ఫేట్ 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. సొంతంగా ఎలాంటి మందులు పిచికారి చేయకూడదు.
– రాఘవేంద్ర, ఏఈవో బీబీపేట
చలి తీవ్రతకు ఎదగని నారు
రెండు సార్లు వడ్లను పోస్తున్న రైతులు
వాతావరణంలో మార్పులే
కారణమంటున్న వ్యవసాయాధికారులు
జాగ్రత్తలు పాటించాలని సూచన


