
నిరాశాజనకంగా నిజాంసాగర్
వర్షాలు కురిస్తేనే..
6వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టతో పాటు హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6,284 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,392.40 అడుగుల (5.203 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. దీంతో ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుణుడు కరుణిస్తే తప్ప ఆయకట్టు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు ఇరువైపులా మోటార్లు ఏర్పాటు చేసి మరో 15 వేల ఎకరాల వరకు అనధికారికంగా పంటలు పండిస్తున్నారు.
రెండు విడతల్లో 1.58 టీఎంసీలు విడుదల
ఈ సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టుకు ఇప్పటివరకు రెండు విడతల్లో 1.58 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూన్ 25 నుంచి జూలై 9 వరకు మొదటి దఫాలో 0.766 టీఎంసీల నీరందించారు. అదేనెలలో 15 నుంచి 23 వరకు రెండో దఫాలో 0.814 టీఎంసీల నీరు విడుదల చేశారు. అయితే వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 1.224 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.203 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీలో 0.9 టీఎంసీ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురియకపోతే ఆయకట్టు పంటలు గట్టెక్కడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎగువనుంచి ఆశలు అంతంతే..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన సింగూరు ప్రాజెక్టుతో పాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతంతోపాటు మిషన్ భగీరథ గ్రిడ్కు తాగు నీటి సరఫరాకు పరిమితం అయ్యింది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అయితే కొండ పొచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం
అలీసాగర్ వరకు 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు
పంటలు గట్టెక్కాలంటే మరో
నాలుగు తడులు అవసరం
వెలవెలబోతున్న ప్రాజెక్టు..
వరుణుడి కరుణపైనే ఆశలు
వర్షాలు కురిస్తేనే..
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రాజెక్టు కింద సాగు చేసిన పంటలు గట్టెక్కాలంటే నాలుగు తడులైనా నీరివ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో నాలుగు తడులు ఇవ్వలేం. వర్షాలు కురిసి ఎగువనుంచి వరదలు వస్తేనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించగలం.
– శ్రీనివాస్, సీఈ, కామారెడ్డి