హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం! | - | Sakshi
Sakshi News home page

హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం!

Apr 29 2025 8:15 AM | Updated on Apr 29 2025 8:15 AM

హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం!

హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం!

భిక్కనూరు: భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీ లెక్కింపులో ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతి వాటాన్ని ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీని లెక్కించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామరావు ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. భక్తులు హుండీ లెక్కిస్తున సమయంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ విజయరామరావుతో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తుండగా ఓ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించి, ఓ నోట్ల కట్టను పాకెట్‌లో పెట్టుకుని నందిమండపం వైపు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అతడి వెనకే వెళ్లారు. అక్కడ సదరు ఉద్యోగి లేకపోవడంతో కల్యాణం నిర్వహించే షెడ్డు వైపు వెళ్లగా ఆక్కడ కనిపించాడు. మహేందర్‌రెడ్డి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేబులు చూపించమనగా.. ఓ నోట్ల కట్ట కనిపించింది. తొలిసారి తప్పు చేశానని, క్షమించాలని సదరు ఉద్యోగి వేడుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ను వివరణ కోరగా ఓ ఉద్యోగి హుండీ లెక్కింపు సమయంలో చేతివాటాన్ని ప్రదర్శించింది వాస్తవమేనని, దీనిపై ఈవోకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కాగా శ్రీసిద్దరామేశ్వరాలయంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పునరావృతం అవుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement