
డ్రంకన్డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
ఎడపల్లి(బోధన్): మండలం కేంద్రంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అంబం(వై)గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.
సమయపాలన పాటించని వ్యాపారికి..
ఆర్మూర్టౌన్: పెర్కిట్లో షేక్ మాజీద్ తన దుకాణంను రాత్రివేళ సమయపాలన పాటించకుండా నడపడంతో ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ కేసు నమోదు చేశారు. దీంతో షేక్ మాజీద్ను మంగళవారం కోర్డులో హాజరుపర్చగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తు తీర్పును వెల్లడించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన తోగటి భమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి మామిడిపల్లిలోని వృద్ధాశ్రమానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళం ధ్వంసం చేసిఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బీరువాలోని 5తులాల బంగారం, 80గ్రాముల వెండిన దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
కులాస్పూర్ తండా, బాడ్సిలో అగ్నిప్రమాదం
మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండా, బాడ్సి గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కులాస్పూర్ తండాలో బంతిలాల్కు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకుని పెళ్లి కోసం కొనుగోలు చేసిన కలప దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా, నిజామాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది మంటలార్పేశారు. ప్రమాదంలో సుమారు రూ.40వేల వరకు నష్టం జరిగినట్లు బంతిలాల్ పేర్కొన్నాడు. అలాగే బాడ్సిలో కోసిన వరి గడ్డికి నిప్పంటుకుంది. డయల్ 100కు గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్ఐ యాదగిరి గౌడ్, సిబ్బందితో అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇందల్వాయి నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. బదావత్ చత్రు గడ్డి, కె శ్రీనివాస్ పైపులు ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి.
సిర్నాపల్లి అడవుల్లో ఇసన్నపల్లి వాసి హత్య?
రామారెడ్డి: కామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సిర్నాపల్లి అడవులలో ఏడు నెలల క్రితం హత్య చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులతో పాటు మృతుడి భార్యను రామారెడ్డి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య ఘటనలో ఆరు నుంచి ఎనిమిది మంది పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు గల్ఫ్కు వెళ్లినట్లుగా మృతుడి భార్య బంధువులను నమ్మించింది. మృతుడి అన్నకు అనుమానం రావడంతో రామారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడు గల్ఫ్ దేశం వెళ్లలేదని, తమ్ముడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించిందని ఫిర్యాదు చేశాడు.మృతుడు గల్ఫ్ దేశం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ లేదనే సమాచారం పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ఎస్పీ నేరుగా రంగంలోకి దిగడంతో హత్య ఘటన కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

డ్రంకన్డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు