
టేకుచెట్ల నరికివేతపై విచారణ
ఎల్లారెడ్డి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో టేకుచెట్ల నరికివేతపై అటవీశాఖ అధికారులు సోమవారం విచారణ నిర్వహించారు. వార్డెన్ శారదను అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో ఓంకార్ టేకు చెట్ల నరికివేత గురించి వివరాలు సేకరించారు. హాస్టల్లో కోతులు విద్యార్థులపై దాడులు చేస్తుండడంతో చెట్లను నరికివేయించినట్లు వార్డెన్ తెలిపారు. అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికినందున అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, ఎల్లారెడ్డి డీఆర్వో శ్రీనివాస్నాయక్ తదితరులున్నారు.
మెడికల్ కళాశాలకు మృతదేహం దానం
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన చెల్లల గంగారాం (65) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గంగారాం మృతదేహాన్ని నిజామాబాద్ మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు. జుక్కల్ మండలం దోస్పల్లి తెలంగాణ ఉప పీఠం జగద్గురు రామానంద ఉపదేశాల మేరకు కుటుంబసభ్యులు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం అప్పగించారు. జగద్గురు స్వామిజీ భక్తులు ఇప్పటి వరకు 94 శవాలను మహారాష్ట్ర, తెలంగాణలోని ఆయా జిల్లాలో మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గాంధారి–లింగంపేట్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చద్మల్ తండాకు చెందిన మాండు జీవన్(45) సోమవారం బైక్పై రాంలక్ష్మణ్పల్లి వైపు నుంచి గుర్జాల్తండా వైపు బయలుదేరాడు. బ్రాహ్మణ్పల్లి స్టేజీ సమీపంలో అతడి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.