తుని: భర్త వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించిన తల్లిని స్థానిక జీఆర్పీ సిబ్బంది రక్షించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొండంగి మండలం ఎల్లయ్యపేట గ్రామానికి చెందిన వరికుంట్ల వరలక్ష్మి గురువారం స్కూల్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లలను తీసుకుని తుని రైల్వేస్టేషన్కు వచ్చింది. స్కూల్ యూనిఫాంతో ఉన్న నా చిన్నారులతో కలిసి ట్రాక్పైకి వచ్చి ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శివ, సురేష్, నాగరాజు, ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ వారు ఆ తల్లిని ఆత్మహత్యా యత్నానికి దారి తీసిన కారణాలపై ప్రశ్నించారు. ఆమె భర్త రమేష్ ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు కాఫీ హోటల్లో సంపాదించిన సొమ్ము తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడని, సొమ్ము ఖర్చు చేసి వచ్చిన రమేష్ నీది దిక్కులేని పరిస్థితి, ఎక్కడి కై నా వెళ్లిపో, లేదా చచ్చిపో అంటున్నాడని ఆమె చెప్పింది. భర్త వేధింపులతో మనస్తాపానికి గురై ఆమె తన ఇద్దరు పిలలతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. వరలక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిల్లలు, తల్లిని అప్పగించారు. ఈ విషయాన్ని తొండంగి పోలీస్స్టేషన్ ఎస్సైకు రైల్వే పోలీసులు తెలియజేశారు. బాధతరాలిని పోలీస్స్టేషన్కు పిలిపించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. సకాలంలో స్పందించిన జీఆర్పీ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
భర్త వేధిస్తున్నాడని మనస్తాపంతో నిర్ణయం
తుని రైల్వే ట్రాక్పై ఉండగా
రక్షించిన జీఆర్పీ సిబ్బంది
పిల్లలతో సహా
ఆమె తల్లిదండ్రులకు అప్పగింత


