● పర్యావరణ పరిరక్షణకు
మట్టి వినాయక ప్రతిమలే మేలు
● ప్రతి ఏటా వేలాది మట్టి విగ్రహాల పంపిణీ
● పర్యావరణహిత వినాయక చవితికి
స్వచ్ఛంద సంస్థల పిలుపు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, పర్యావరణ ప్రేమికులు నడుం బిగిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏటా వేలాది మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. భక్తి పేరుతో ఆడంబరాలకు వెళ్లి ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ), రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించవద్దని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. పీవోపీ విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో పాటు వాటికి వినియోగించే రసాయనిక రంగులు జలవనరులను కలుషితం చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల సహజ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.
కాకినాడలో ఏటా 20 వేల మట్టి విగ్రహాల పంపిణీ
కాకినాడ నగరంలో ప్రముఖ దంత వైద్యుడు అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సుమారు 2 వేల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ధరిత్రి రక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్తో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను తీసుకెళ్లి పూజించేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సామర్లకోట, పిఠాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో రోటరీ, లయన్స్ క్లబ్లతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


