ఫ మరోసారి
రాజవొమ్మంగి అడవుల్లోకి రాక
ఫ ప్రజలను అప్రమత్తం చేస్తున్న
అధికారులు
రాజవొమ్మంగి: ప్రజలను హడలెత్తిస్తున్న పులి మరో మారు రాజవొమ్మంగి అడవుల్లోకి వచ్చింది. గురువారం ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్లోని ఉలిగోగులపాడు పరిసర అటవీ ప్రాంతంలో సంచరించగా, అదే రోజు రాత్రి రాజవొమ్మంగి అడవుల వైపు వచ్చినట్లు సమాచారం. రాజవొమ్మంగి ఫారెస్టు రేంజ్ వాతంగి పరిసర అడవికి పులి వచ్చినట్లు రేడియో కాలర్ ద్వారా తెలిసిందని రాజవొమ్మంగి రేంజ్ ఆఫీసర్ ఉషారాణి శుక్రవారం విలేకరులకు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం రాజవొమ్మంగి అటవీ క్షేత్రంలో హల్చల్ చేసి, అనేక పశువులను చంపి, జిల్లా దాటి వెళ్లిపోయిన పులి తిరిగి ఇదే ప్రాంతానికి మరోసారి రావడంతో వాతంగి పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాగా వాతంగి, కొమరాపురం, ఓగిపాలెం, లోదొడ్డి, ఓకుర్తి, బట్టావారివీధి, పెద రెల్లంగిపాడు రిజర్వు ఫారెస్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను మేతకు అడవుల్లోకి విడిచిపెట్టవద్దని, రాత్రి పూట ఒంటరిగా తిరగవద్దని రేంజ్ ఆఫీసర్ ఉషారాణి గిరిజనులకు సూచించారు. రాత్రి వేళల్లో ఇళ్లలో లైట్లు వేసి ఉంచాలని కోరారు. తమ సిబ్బంది ఆయా గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని దండోరా వేస్తున్నారని తెలిపారు.
ఆవెల్తి గ్రామంలో ఆవులపై పులి దాడి!
శంఖవరం: మండలంలోని అవెల్తి గ్రామంలో శుక్రవారం రాత్రి పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా మరో ఆవు గాయపడిందని గిరిజనులు తెలిపారు. గ్రామ శివారులో రెండు పశువులపై పులి దాడి చేయగా, ఒక ఆవు మృతి చెందిందని, మరో ఆవు గాయాలతో ఇంటికి వచ్చిందన్నారు. రాత్రి సమయం కావడంతో ఘటనా స్ధలానికి వెళ్లడం వీలుకాక, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించిన అనంతరం పులి దాడి చేసిందా, మరేదైనా జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.


