పెరవలి: మండలం ముక్కామల వద్ద బాపన్న కాలువలో మంగళవారం గల్లంతైన ఏడిద రవితేజ (41) మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలో లభ్యమైనట్టు ఎసై అలెగ్జాండర్ తెలిపారు. కాలువలో స్నానానికి దిగి ప్రమాదశాస్తూ కాలువలో కొట్టుకుపోయిన రవితేజ మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు గాలించినా దొరకని విషయం తెలిసిందే. మంగళవారం కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.
రూ.లక్ష విలువైన
గడ్డి వామి దగ్ధం ˘
దేవరపల్లి: మండలంలోని బుచ్చియపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాట్రు వీరవెంకటసత్యనారాయణకు చెందిన గడ్డివామి దగ్ధమైంది. గ్రామ శివారున ఉన్న తన పొలంలో సుమారు రూ.1 లక్ష విలువైన వెయ్యి కట్టల ఎండుగడ్డి పూర్తిగా కాలిపోయినట్టు రైతు వీర వెంకటసత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గడ్డివామి సమీపంలో పొగాకు బ్యారన్లు, రూ.లక్షల విలువ గల పొగాకు బేళ్లు ఉన్నాయని, ప్రమాద సమయంలో గాలి లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు.
22 నుంచి వనదుర్గ జాతర
అన్నవరం: రత్నగిరి వనదేవత శ్రావణమాస జాతర మహోత్సవాలు 22వ తేదీ శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకు సాగనున్నాయి. 22న అమ్మవారిని బాల త్రిపురసుందరిగా, 23 సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25 న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శనాలు కల్పించనున్నారు. 28న అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగించనున్నారు.
బాధల బడిబాట!
చాగల్లు: విద్యార్థులే కూలీలుగా మారిన ఘటన వాడపల్లి చంద్రవరం రహదారిలో చోటుచేసుకుంది. కూటమి ప్రభత్వం వచ్చిన తరువాత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాడపల్లి, చంద్రవరం రహదారిలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు గుంతలో దిగపడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులే రాళ్లు తీసుకువచ్చి టైర్ కింద వేసి బస్సు కదిలేలా చేశారు. అధికారులు స్పందించి ఈ పుంత రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కొనసాగుతున్న
జూనియర్ వైద్యుల నిరసన
కాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్ వైద్యుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఎనిమిదో రోజుకు చేరిన దీక్షలో జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే దీక్షలు చేశారు. బుధవారం నాటి నిరసనలో 500 మందికి పైగా జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. శిక్షణ భృతి, వయోపరిమితి 65కి పెంచడాన్ని ఉపసంహరించుకోవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండి, ఎంఎస్ చేసిన వైద్యులకే ప్రాధాన్యం ఇవ్వడం తమ ప్రధాన డిమాండ్లని నాయకులు తెలిపారు.
నిందితుడికి రెండేళ్ల జైలు
తుని: ఓ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.రెండు వేల జరిమాన విధించినట్లు సీఐ గీతారామకృష్ణ బుధవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామానికి చెందిన విజ్జం నాగరాజు 2019లో జరిగిన ఓ కేసులో ముద్దాయి. అప్పటి ఎస్సై వి.శేషుకుమార్ కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ అనంతరం కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న జేఎఫ్సీఎం జడ్జి వి.గోపాలకృష్ణపై శిక్ష విధించారు.


