కాకినాడ రూరల్: రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక మృతి ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. కాకినాడ గైగోగుపాడులోని ఆమె నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడంతో రహదారులపై రక్తపు మరకలు అంటుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఇంటా.. బయట రక్షణ లేకుండా పోయిందని, రాజమహేంద్రవరంలో పీజీ చేస్తున్న వైద్యురాలిపై జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. పైగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మద్యం మత్తులో ఉన్న ఉన్మాదులు అత్యంత పాశవికంగా ప్రియాంకను కారుతో ఢీకొట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దిశ బిల్లు రద్దు చేయడంతో మహిళల్లో అభద్రతా భావం పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. మహిళలకు నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం అందుబాటులోకి తీసుకువచ్చి భద్రత కల్పించిందని గుర్తు చేశారు.
పోటీలకు ఏర్పాట్లు
నాగమల్లితోట జంక్షన్: జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించనున్న అమరావతి జిల్లా స్థాయి చాంపియన్షిప్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో 12న అండర్–17, 23 బాలికలకు, 13న అండర్–17, 23 బాలురకు పోటీలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే జిల్లాస్థాయికి అర్హులన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు క్రీడా మైదానంలోని పోటీల వేదిక వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్; బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, యోగా, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, ఖోఖో, కబడ్డీ, హాకీ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణకు స్టేడియంలో వివిధ ప్లే ఫీల్డ్స్ను సిద్ధం చేశామని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దివ్యాంగుల సాధికారత జాతీయ పురస్కారాల కోసం అర్హులు, సంస్థల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 15లోగా ఆన్లైన్లో సమర్పించాలన్నారు.


