రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.


