ఏమంటారో.. ఏం చేస్తారో..! | - | Sakshi
Sakshi News home page

ఏమంటారో.. ఏం చేస్తారో..!

Apr 21 2025 12:09 AM | Updated on Apr 21 2025 12:09 AM

ఏమంటారో.. ఏం చేస్తారో..!

ఏమంటారో.. ఏం చేస్తారో..!

అన్నవరం దేవస్థానం

నేడు రత్నగిరికి రానున్న

అదనపు కమిషనర్‌

వివాదాలపై రెండు రోజుల పాటు

చంద్రకుమార్‌ విచారణ

అన్నవరం దేవస్థానంలో సర్వత్రా ఉత్కంఠ

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు, వివాదాలపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ కె.చంద్రకుమార్‌ సోమవారం రానున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన వివిధ అంశాలపై విచారణ నిర్వహించనున్నారు. దీంతో, అన్నవరం దేవస్థానంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎవరెవరిని ఏయే ప్రశ్నలడుగుతారో.. వాటికి ఏం జవాబు చెప్పాలనే దానిపై సిబ్బంది తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరిపై ఏ చర్యలు తీసుకునే అవకాశముందనే విషయమై కూడా చర్చించుకుంటున్నారు. దేవస్థానంలో నెలకొన్న వివాదాలపై విచారణకు చంద్రకుమార్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దేవస్థానంలో చోటు చేసుకుంటున్న వివాదాలపై విచారణ నిర్వహించి, మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయనను కమిషనర్‌ ఆదేశించారు. అందువలన రెండు రోజుల పాటు విచారణ నిర్వహించి, మూడో రోజు నివేదిక సమర్పిస్తారని తెలిసింది. ఆ నివేదికపై వారాంతంలోగా చర్యలు తీసుకుంటారని సమాచారం. చంద్రకుమార్‌ గతంలో సుమారు ఏడాది పాటు ఇక్కడ ఈఓగా పని చేశారు. అందువలన ఆయనకు దేవస్థానం కార్యకలాపాపై పూర్తి అవగాహన ఉంది. పరిస్థితులను త్వరగానే అర్థం చేసుకోగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విచారణాంశాలివే..

● ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు కుమారుడు దేవస్థానంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూములో సీసీ టీవీలను పర్యవేక్షించడం.. డ్రోన్‌ కెమెరాల కొనుగోలు అంశంపై ఈఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఈఓతో కలసి పాల్గొనడం.. ఈఓ క్యాంపులో ఉన్నప్పుడు ఆయన అధికారిక వాహనంలో దేవస్థానానికి రాకపోకలు సాగించడం వంటి అంశాలపై చంద్రకుమార్‌ విచారణ నిర్వహించనున్నారు.

● దేవస్థానంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వేంకటేశ్వరరావు వలంటరీ రిటైర్మెంట్‌కు దరఖాస్తు చేయడం, ఏఈఓ సెలవు, మరో ఇద్దరు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు సెలవు కోరడంపై కూడా విచారించనున్నారు.

● సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు ఇవ్వకపోవడంపై కూడా విచారణ జరపనున్నారు.

● పీహెచ్‌డీ పట్టా లేకపోవడంతో గతంలో పని చేసిన ఈఓలు సత్యదేవ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రావును రెగ్యులర్‌ చేయలేదు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఫైలు పెట్టినపుడు పీహెచ్‌డీ లేదనే కారణంతో నిలిపివేశారు. ప్రస్తుత ఈఓ ఆయనను రెగ్యులర్‌ చేయడంపై కూడా విచారించనున్నారు.

● దేవస్థానంలో స్వామివారి దర్శనం, ప్రసాదం, మౌలిక వసతుల కల్పనపై మూడు నెలలుగా భక్తుల అసంతృప్తి పెరుగుతున్నట్టు ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా నిర్ధారణ అవుతోంది. దీనిపై చంద్రకుమార్‌ సమీక్షించనున్నారు.

● నీటి సమస్య సాకుతో దేవస్థానం సత్రాల్లో ఏసీ గదులను ఒక రోజు అద్దెకివ్వకపోవడంపై కొద్ది రోజుల కిందట వివాదం రేగింది. దీనిపై కలెక్టర్‌ షణ్మోహన్‌, కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి గదులు అద్దెకివ్వడం పునరుద్ధరించినా దేవస్థానం అప్రతిష్ట పాలవడంపై కూడా విచారణ జరపనున్నారు.

● దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్లకు కొంత కాలం జీతాలు నిలిపివేశారు. దీనికి గల కారణాలపై కూడా దృష్టి సారించనున్నారు.

● స్వామివారి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణకు చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ను నియమించాల్సిన అవసరం ఉందా అనే అంశంపై సిబ్బంది అభిప్రాయాలు అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పలు అంశాలపై చంద్రకుమార్‌ విచారణ జరుపుతారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement