ధరూరు/ కేటీదొడ్డి: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా విద్యార్థుల సామర్థ్యాలను మరింత మెరుగుపడాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మండలంలోని అల్వాలపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యా బోధనలో మెలకువలు పాటించి, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి గణిత సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే ఎఫ్ఎల్ఎన్, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్, పీజీఐ ఇండికేటర్స్కు సంబంధించిన ఆనర్లైన్ పనులన్నీ ఆన్లైన్లో క్లియర్ చేయాలని కోరారు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏజెన్సీ వారికి సూచించారు.
మధ్యాహ్న భోజనం పరిశీలన..
కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి రుచికరంగా భోజనం పెట్టాలని సూచించారు. ల్యాబ్, సాధారణ విద్యా విషయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసులు, ఎంఈఓ విజయభాస్కర్, కాంప్లెక్స్ హెచ్ఎం రాఘవేంద్ర, సీఆర్పీలు పాపయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


