గద్వాల: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు, అలంపూర్ బాలికల, ఇటిక్యాల, అయిజ, గద్వాల బాలుర గురుకుల పాఠశాలల్లో 9వ తరగతిలో ఎస్సీ బాలిక/ బాలురకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. 8, 9 తరగతుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు అర్హులన్నారు. స్పాట్ అడ్మిషన్లకు వచ్చే విద్యార్థులు హాల్టికెట్, బోనోఫైడ్తోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని.. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గట్టులోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల జూనియర్ కళాశాలకు రావాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
మెరిట్ జాబితా విడుదల
గద్వాల: ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా సోమవారం విడుదల చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ షేక్, డీఎంహెచ్ఓ సంధ్య కరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 3, ల్యాబ్ టెక్నీషియన్ 2, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను జిల్లా అధికారిక వెబ్సైట్ https://gadwal.telangana. gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఈ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు గురువారం సాయంత్రం 5 గంటలలోపు లిఖితపూర్వకంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేయాలని సూచించారు.
గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీ
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 10 మంది అర్జీదారులు తమ సమస్యలపై ఏఎస్పీ శంకర్కు అర్జీలు అందజేశారు. అనంతరం వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
271 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 271 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,470, కనిష్టంగా రూ.5,269, సరాసరిగా రూ.6,820 ధరలు లభించాయి.
లా, ఇంజినీరింగ్
పరీక్షలు ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజినీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు.


