మానవపాడు: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ డీఈఈ రాజా నరేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని చంద్రశేఖర్నగర్, అమరవాయి, మానవపాడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. మాట్లాడారు. నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ అనిల్, సర్పంచ్ రాజేంద్రప్రసాదు, నాయకులు పరమేష్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. వీరికి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికయ్యే క్రీడాకారులు మహారాష్ట్ర షిరిడీలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి గోగేమ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు.
కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా కొనసాగుతుండటంతో దిగువ, ఎగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 11.141 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 11.86 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 12.327 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ప్రస్తుతం 35 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు.


