అలంపూర్: చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అలంపూర్ మున్సిపాలిటీలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టి తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి, వారిని ఫేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా వేలిముద్రలు తీసుకున్నారు. గతంలో వారిపై నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. దాదాపు 150 ఇళ్లను సోదా చేసి.. సరైన పత్రాలు లేని 60 బైక్లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ నేరాల నిర్మూలనకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. ప్రజల రక్షణతోపాటు భద్రతాభావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి నిరంతరం ఈ కార్యక్రమం చేపడుతామన్నారు. తద్వారా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు తెలుస్తుందన్నారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసికంగా, శారీరకంగా వేధించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు రామకృష్ణ, రవి, సురేష్, తరుణ్, 30 మంది పోలీసులు పాల్గొన్నారు.


