ధరూరు: కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అక్కడి భద్రతపై ఎస్పీ శ్రీనివాసరావు ఆరా తీశారు. ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్యలతో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించిన ఆయన ముందుగా ప్రాజెక్టు రిజర్వాయర్, వాటర్ లెవెల్ ప్రాంతాలను సందర్శించారు. అనంతరం క్రస్టు గేట్ల ద్వారా దిగువకు విడుదవలవుతున్న వరదను పరిశీలించారు. ఆ తర్వాత ఫ్లడ్ కంట్రోల్ రూంలో వరద పరిస్థితిపై ప్రాజెక్టు డీఈ నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. క్రస్టు గేట్ల వివరాలను తెలుసుకున్న ఆయన ప్రతి క్రస్టు గేటు ముందు అమర్చిన సీసీ కెమెరాల పనితీరును స్క్రీన్ ద్వారా పరిశీలించారు. మొత్తం 64 గేట్లకు సీసీ కెమెరాలు అమర్చినట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు నిషేధిత ప్రాంతాలకు సందర్శకులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందుకు సాగాలన్నారు. కార్యమంలో ఏఈలు సుదర్శన్, సిద్దయ్య, కిషోర్కుమార్, ఎస్ఐలు శ్రీకాంత్, నందికర్ పాల్గొన్నారు.
సీఎస్ఏఎం వీడియోలు చూస్తే కేసులు
గద్వాల క్రైం: చిన్నారులకు సంబంధించిన సీఎస్ఏఎం (చైల్డ్ ఫోర్నోగ్రఫి) వీడియోలు చూసినా.. డౌన్లోడ్ చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల వంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఒక్కరి వ్యవహారాలపై సాంకేతిక విభాగం నిఘా ఉంచిందని చెప్పారు.


