●
బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం.
– రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు,
ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత
నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ,
బీడీ కార్మికురాలు, అమరచింత
చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం.
– సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం
అమరచింత: మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బీడీ కూలి పెంచాలంటూ కార్మికులు, కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలంటూ గురువారం టీయూసీఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలోని బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు డిమాండ్ నోటీసులు అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సమావేశంలో గర్జించారు. ప్రస్తుతం వెయ్యి బీడీల తయారీకి రూ.230 నుంచి రూ.290 చొప్పున యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. రెండేళ్లకు ఓసారి కూలి ధరలు పెంచాలనే నిబంధన ఉండటంతో ఈసారి రూ.400 చెల్లించాలనే డిమాండ్తో కార్మికులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి పోరాటం సాగించేందుకు సిద్ధమవుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట కేంద్రంగా బీడీ ఫ్యాక్టరీలు అనేకం కొనసాగుతున్నాయి. ప్రధాన శాఖలు అక్కడే ఉండగా.. వివిధ గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న బీడీ ఖార్కానాలు కొనసాగిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి చండూల్, వస్తాద్, రెడ్డి, మహరాజ్, రింగ్రెడ్డి, 6 నెంబర్, సంఘం, ఆజాం, అమృతం తదితర బీడీ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి.
రెండేళ్లకు ఓసారి వేతన సవరణ..
ప్రతి రెండేళ్లకు ఒకసారి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచాలనే నిబంధన ఉంది. ప్రసు ్తతం గడువు ముగియడంతో టీయూసీఐ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు గురువారం చిన్నచింతకుంటలో ఆందోళన చేపట్టి అక్కడి బీడీ ఫ్యాక్టరీ యా జమాన్యాలను కలిసి వేతన పెంపు డిమాండ్ నో టీ సులు అందజేశారు. త్వరలోనే యాజమాన్యాలు బీడీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 40 వేల పైచిలుకు బీడీ కార్మికులు ఉంటారు. రోజు తమ గ్రామాల్లోని బీడీ ఫ్యాక్టరీ బ్రాంచ్లకు వెళ్లి వెయ్యి బీడీల తయారీకి వినియోగించే ఆకు, పొగాకు తీసుకొచ్చి తయారుచేసి మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీకి అప్పగిస్తారు. వారికి ఇచ్చిన పుస్తకంలో రోజువారీ బీడీ లెక్కలు రాసుకుంటూ నెలలో రెండు పర్యాయలు కూలి డబ్బులు చెల్లిస్తుంటారు. కాగా ఫ్యాక్టరీల యాజమాన్యం బీడీల తయారీలో వేస్టేజీ పేరుతో చెల్లించే వేతనంలో కొంతమేర జరిమానా రూపంలో కోత విధిస్తోంది. దీనిని ఎత్తివేయాలని కార్మికులు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు పెంచాలంటూ యాజమాన్యాలకు నోటీసులు
ప్రస్తుతం వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లింపు
రూ.400 చెల్లించాలని డిమాండ్
ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది
కార్మికులు


