ఇదీ గ్రామ చరిత్ర..
వ్యాసతత్వ తీర్థులుగా పిలువబడే వెంకట రామాచార్యులను అయిజ ఆచార్యులు అని పిలిచేవారు. ఈయన మంత్రాలయం పీఠాధిపతులలో పదవ వ్యక్తి. కొంతకాలానికి ఈయన పీఠాధిపతి బాధ్యతల నుంచి తప్పుకొని తుంగభద్ర నది తీరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం గద్వాల సంస్థాన రాజుల గురువులలో ముఖ్యుడిగా చేరారు. అయితే ఈయనకు సంతానం లేకపోవడంతో వేణుగోపాలస్వామి ఆయనకు స్వప్నంలో కనిపించి ఇటిక్యాల మండలంలోని వల్లూరు గ్రామ చెరువు తూము కింద తవ్వకాలు జరిపితే విభిన్నమైన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుందని, ఆ విగ్రహాన్ని వేణిసోంపురం నదీతీరాన ప్రతిష్ఠిస్తే నీకు సంతానం కలుగుతుందని స్వామివారు స్వప్నంలో చెప్పారు. వెంటనే వ్యాసతత్వ తీర్థులు అక్కడ తవ్వకాలు జరిపించగా.. రెండు కృష్ణుడి విగ్రహాలు కనిపించాయి. ముందుగా ఎడమకాలిపై కుడికాలు వేసుకొని పిల్లన గ్రోవి ఊదుతున్న విగ్రహం కాగా.. కుడికాలిపై ఎడుమకాలు వేసుకొని పిల్లన గ్రోవి ఊదుతున్న విగ్రహం లభ్యమమయ్యాయి. మొదటి విగ్రహాన్ని అదే గ్రామంలో ప్రతిష్ఠించారు. విభిన్నంగా ఉన్న రెండో విగ్రహాన్ని వేణిసోంపురం నదీతీరం వద్ద ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. అనంతరం వ్యాసతత్వ తీర్థులకు సంతానం కలిగింది. అప్పటి నుంచి అక్కడ ఉన్న వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సంతాన వేణుగోపాలస్వామిగా పిలుస్తున్నారు. వెంకటరామాచార్యుల రాకతో వేణిసోంపురం మరో మంత్రాలయంగా ఖ్యాతి గడించింది.


