నిర్లక్ష్యంపై నిరసన సెగ.. | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంపై నిరసన సెగ..

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

నిర్లక్ష్యంపై నిరసన సెగ..

నిర్లక్ష్యంపై నిరసన సెగ..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కుమ్మెర ఆలయంలో భక్తులపై నిర్వాహకుల దాడి ఘటనలో రెండు నెలల శిశువు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై ఆదివారం బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో వివిధ సంఘాల నేతలు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

పోలీసుల వైఖరిపై మండిపాటు..

కుమ్మెర మల్లన్న ఆలయానికి ఈనెల 18న గ్రామానికి చెందిన చంద్రకళ, కీర్తి, గణేశ్‌, మౌనిక దర్శనం కోసం వెళ్లారు. రూ.100 ఎంట్రీ టికెట్‌ విషయంలో నిర్వాహకులు, భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు గణేశ్‌, చంద్రకళపై నిర్వాహకులు దాడిచేశారు. ఆలయం పక్కన కొబ్బరికాయల గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మౌనికపై సైతం దాడికి పాల్పడటంతో రెండు నెలల శిశువు సైతం కిందపడిపోయింది. కాగా, ఈనెల 21న శిశువు మరణించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా కాకుండా వేరే కారణంతో మరణించి ఉండవచ్చని తమనే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు మౌనిక వాపోయారు.

రెండు రోజులపాటు కొనసాగిన నిరసనలు..

ఈనెల 18న కుమ్మెర ఆలయంలో దాడి ఘటన చోటుచేసుకోగా, శనివారం శిశువు మృతి చెందింది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్‌ మహారాజ్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన కొనసాగింది. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈనెల 18న ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పోలీసులను ప్రశ్నించారు. మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేస్తే ముగ్గురిని మాత్రమే అదుపులో తీసుకుంటామని చెప్పడం నిందితులను కాపాడటమేనని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి బంధువులు అయినందుకే వారిని కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

ముగ్గురు రిమాండ్‌కు తరలింపు..

కుమ్మెర ఆలయంలో భక్తులపై దాడికి పాల్పడిన నిర్వాహకుల్లో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కుమ్మెర గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మధుసుదన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి రిమాండ్‌ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. శిశువు మృతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్టు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగించి విచారణను పూర్తిచేస్తామన్నారు.

వివాదాస్పదంగా పోలీసుల తీరు

మల్లన్న జాతర ఘటనలో శిశువు మృతి

పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ప్రతిపక్షాల నిరసన

ఎట్టకేలకు ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement